బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్కు గురైన తర్వాత ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ కార్యకలాపాలను మళ్లీ వేగవంతం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థను పునరుత్తేజం చేయడానికి ఆమె పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని జాగృతి రాష్ట్ర కమిటీకి కొత్త సభ్యులను నియమించినట్లు కవిత ప్రకటించారు.
ఈ నియామకాల్లో సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు. కొత్త కార్యవర్గంలోని 80 శాతం పదవులను బడుగు, బలహీన వర్గాల వారికి కేటాయించినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఎస్టీ వర్గానికి చెందిన సీనియర్ నేత లకావత్ రూప్ సింగ్ను జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
బీఆర్ఎస్ సస్పెన్షన్ తర్వాత కవిత భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై పలు ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే ఆమె ఇప్పుడు తన సొంత సంస్థ జాగృతిని బలోపేతం చేయడంపైనే దృష్టి సారించడం ద్వారా తన ప్రత్యేక దారి ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది.
అదే సమయంలో త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేపట్టనున్నట్లు కూడా ఆమె ప్రకటించారు. ఈ పర్యటనలో జిల్లాల మేధావులు, కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించనున్నారు. ప్రజల సలహాల ఆధారంగా జాగృతి కమిటీ మూడో దశ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
మహిళా జాగృతి విభాగంలోనూ కవిత పెద్ద ఎత్తున నియామకాలు పూర్తి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలిగా పిట్టల శ్యామల, పెద్దపల్లి హారిక రావు, హనుమకొండ మంజుల రావు, వరంగల్ నూకల రాణి, కరీంనగర్ అంకం శివరాణి, జగిత్యాల దొనకొండ సుజాత, రంగారెడ్డి బండారి లావణ్య, నాగర్కర్నూల్ చిలుక మంజుల రెడ్డి, మేడ్చల్ తీనేత సంధ్యారెడ్డిని నియమించినట్లు వెల్లడించారు.
జాగృతి పునరుద్ధరణలో భాగంగా కవిత తీసుకున్న ఈ నిర్ణయాలు ఆమె భవిష్యత్ రాజకీయాలపై పెద్ద ఎత్తున ప్రభావం చూపనున్నాయి.







