జమ్మూకశ్మీర్ పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సోమిశెట్టి మధుసూదన్ రావుకు పార్టీ అగ్రనేతలు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ పహల్గామ్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మధుసూదన్ రావు సామాన్య అరటి పండ్ల వ్యాపారి కుటుంబంలో పుట్టి, కష్టపడి చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మంచి జీవితం గడిపారు. అయితే, ఉగ్రవాదుల దాడిలో ఆయన మరణించడం చాలా బాధాకరమని మంత్రి నాదెండ్ల తెలిపారు. మధుసూదన్ రావు భార్య ఈ దాడి గురించి చెప్పుకుంటూ తట్టుకోలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటన జరిగిన వెంటనే, పార్టీ అధ్యక్షుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించడం జరిగినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. మృతుడి ఆత్మశాంతి కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించామని, భారతీయుల ఐక్యతను చాటేందుకు మానవహారం కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడికి కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా తీవ్రమైన, బలమైన సమాధానం ఇస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా నమ్మకం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అజేయమైన చర్యలు తీసుకుంటుందని, ఈ దాడికి సంబంధించిన నేరస్తులను సత్వరమే శిక్షిస్తామని ఆయన చెప్పారు.

