ఆంధ్రప్రదేశ్ రవాణా రంగానికి గేమ్చేంజర్గా భావిస్తున్న విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ రెండు నగరాల్లో ఫేజ్–1లో భాగంగా 80 కిలోమీటర్లకుపైగా మెట్రో ట్రాక్ నిర్మాణం జరగనుంది. ఇందులో సివిల్ పనుల టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.పీ. రామకృష్ణా రెడ్డి వివరించారు.
ఫేజ్–1లో భాగంగా విశాఖపట్నంలో 46.23 కిలోమీటర్ల ట్రాక్, విజయవాడలో 38 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం జరుగుతుందని ఆయన తెలిపారు. కలిపి దాదాపు 40 శాతం సివిల్ పనుల కోసం టెండర్లు ఇప్పటికే పిలిచారని వెల్లడించారు.
టెండర్ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ప్రీ బిడ్ మీటింగ్లో పలు కాంట్రాక్ట్ సంస్థలు జాయింట్ వెంచర్స్కు (JV) అవకాశం ఇవ్వాలని, పనులను చిన్న చిన్న ప్యాకేజీలుగా విభజించాలని సూచించాయి. ఈ నేపథ్యంలో ఎండీ రామకృష్ణా రెడ్డి స్పందిస్తూ, సంస్థల వినతిని పరిగణనలోకి తీసుకుని గరిష్టంగా మూడు కంపెనీలు కలిసి జాయింట్ వెంచర్గా టెండర్లలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. దీని వల్ల మరింత పోటీ పెరిగి పనుల నాణ్యత మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు.
అయితే పనులను చిన్న చిన్న ప్యాకేజీలుగా విభజించే ప్రతిపాదనను మాత్రం తిరస్కరించారు. కారణంగా 2028 నాటికి మెట్రో ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం, అలాగే నిర్మాణ వ్యయం పెరగకుండా చూడాలన్న ఉద్దేశం ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాల మెట్రో ప్రాజెక్టుల అధ్యయనంలో కూడా పెద్ద ప్యాకేజీలుగా కొనసాగించడం సమర్థవంతమని నిర్ధారించామని చెప్పారు.
అంతేకాకుండా విశాఖపట్నం మెట్రో టెండర్లకు అక్టోబర్ 10, విజయవాడ మెట్రో టెండర్లకు అక్టోబర్ 14 చివరి తేదీలుగా నిర్ణయించామని వెల్లడించారు. సమయానికి ప్రక్రియ పూర్తయితే నిర్మాణ పనులు వేగంగా ప్రారంభమవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో మెట్రో ప్రాజెక్టులు రవాణా వ్యవస్థకే కాకుండా, ఆర్థిక, సామాజిక, పర్యావరణ మార్పులకు దోహదం చేస్తాయని ఎండీ రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. 2028 నాటికి విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైళ్లు పౌరులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు.+








