Jagga Reddy: సంగారెడ్డి జిల్లా పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను మరో ప్రాంతానికి తరలిస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పేరుతో ఈ కార్యాలయాలను పటాన్చెరు పరిధిలోని కర్ధనూర్కు తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ తరలింపు నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జగ్గారెడ్డి తెలిపారు. ఈ విషయంపై మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో మాట్లాడేవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని ఆయన సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా కార్యాలయాల మార్పు జరిగితే తీవ్ర ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఇది తన సూచన మాత్రమే కాదని, స్పష్టమైన హెచ్చరికగా భావించాలని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సంగారెడ్డి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ALSO READ:Vijay Deverakonda Ranabali | ‘రణబాలి’ గ్లింప్స్ వెనుక నిజం ఇదే.. AI కాదంటున్న దర్శకుడు
