సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం (Tirumala Laddu Controversy)పై తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ నేతలు దౌర్జన్యం, రౌడీయిజం చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. “దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది” అని అన్నారు.
డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు మంత్రులతో సమావేశం నిర్వహించి, లడ్డూ కల్తీపై చర్యలు తీసుకునేలా చర్చించారు. మీడియా సమావేశంలో చంద్రబాబు తెలిపారు: “ప్రజల దృష్టిని మరల్చేందుకు వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నది. తప్పు చేసినవారిపై అన్ని విధాల శిక్ష. సీబీఐ నివేదికలోని సిఫార్సులు అమలు చేస్తాం. కోర్టులో అదనపు సమాచారం అందిస్తాం.”
2022లో నెయ్యి కల్తీపై వచ్చిన నివేదికను అప్పటికి పాలకులు ఎందుకు పక్కన పెట్టారు? భక్తుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశమా? దేవుడి పవిత్రతకు అపచారం జరిగితే, దాన్ని ఖండించడం మన బాధ్యత. అపవిత్రం చోటుచేసుకుంటే భగవంతుడే ప్రజలను సమాయత్తం చేస్తారు. మీరు చేసినది ఘోరమైన అపచారం.”