భారతదేశ న్యాయవ్యవస్థలో కనివిని ఎరుగని ఒక అరుదైన తీర్పు వెలువడింది. 42 ఏళ్ల క్రితం జరిగిన హ**త్య కేసులో 100 ఏళ్ల వృద్ధుడు ధనిరామ్ను అలహాబాద్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సరైన ఆధారాలు లేకపోవడం, అప్పీల్ పరిష్కారంలో దశాబ్దాల కాలం గడిచిన కారణంగా, కోర్టు నిందితుడికి “బెనిఫిట్ ఆఫ్ డౌట్” కింద విముక్తి కల్పించింది.
1982 ఆగస్టు 9న ఉత్తరప్రదేశ్ హమీర్పూర్ జిల్లాలో భూవివాదం కారణంగా గున్వా అనే వ్యక్తి కాల్చి చంపబడ్డాడు. మైకు ప్రధాన నిందితుడిగా, ధనిరామ్ మరియు సత్తిదీన్ అసిస్టెంట్గా ఉన్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. సెషన్స్ కోర్టు 1984లో వీరికి యావజీవ కారాగార శిక్ష విధించింది.
హైకోర్టు జస్టిస్ చంద్రధారి సింగ్, జస్టిస్ సంజీవ్ కుమార్లు విచారణలో, “ప్రాసిక్యూషన్లో స్పష్టమైన లొసుగులు”, నిందితుడి వయసు, అప్పీల్ సుదీర్ఘంగా పెండింగ్లో ఉండటం వంటి అంశాలను గమనించి ధనిరామ్ను అన్ని ఆరోపణల నుండి విముక్తం చేసింది. బెయిల్ బాండ్లను రద్దు చేయాలని కోర్టు ఆదేశించింది.
ఈ తీర్పు వృద్ధాప్యంలో ధనిరామ్కు ఊరట ఇచ్చినప్పటికీ, న్యాయం కోసం నాలుగు దశాబ్దాలు వేచి చూడాల్సిన పరిస్థితి భారత క్రిమినల్ జస్టిస్ సిస్టమ్లో ఉన్న జాప్యాన్ని మరోసారి చూపిస్తుంది.