Ilaiyaraaja: దక్షిణాది ప్రముఖ సంగీత దర్శకుడు “ఇళయరాజా” చట్టపరమైన వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు సంబంధించిన కొన్ని పాటలను ఉపయోగించవద్దంటూ ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామం ప్రస్తుతం సినీ, సంగీత వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
ఇళయరాజా మరియు ప్రముఖ ఆడియో సంస్థ “Saregama” మధ్య కొంతకాలంగా హక్కుల వివాదం కొనసాగుతోంది. ఈ కేసులో కోర్టు తాజాగా జోక్యం చేసుకుని కీలక నిర్ణయం తీసుకుంది. 1976 నుంచి 2001 మధ్య ఇళయరాజా సంగీతం అందించిన 134 సినిమాలకు సంబంధించిన పాటలను తుది తీర్పు వెలువడే వరకూ ఉపయోగించకూడదని ఆదేశించింది.
కోర్టు ఉత్తర్వుల ప్రకారం, ఇళయరాజా గానీ, ఆయన ప్రతినిధులు గానీ, ఇతర సంబంధిత సంస్థలు గానీ ఈ పాటలను ఏ విధంగానూ వినియోగించరాదు. 30 రోజుల్లోగా లిఖితపూర్వక అఫిడవిట్ను కోర్టుకు సమర్పించాలని ఇళయరాజాను ఆదేశించింది.
అసలు విషయానికి వస్తే.. ఆయా సినిమాల నిర్మాతలు పాటల హక్కులను శాశ్వతంగా సరిగమ సంస్థకు విక్రయించారు. అయితే ఇటీవల కొన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లకు ఇళయరాజా అనుమతులు ఇవ్వడం వివాదానికి దారి తీసింది. ఇది తమ కాపీరైట్ హక్కులకు విరుద్ధమని సరిగమ కోర్టును ఆశ్రయించింది.
నిర్మాతల నుంచి హక్కులు కొనుగోలు చేసిన తర్వాత పూర్తి హక్కులు ఆయా సంస్థకే చెందుతాయని కోర్టు స్పష్టం చేసింది. వారి అనుమతి లేకుండా పాటలను ఉపయోగించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. గతంలో ‘అగత్యా’ సినిమా పాట విషయంలో మొదలైన వివాదం ఇప్పుడు ఈ స్థాయికి చేరింది. ఈ కేసు తుది తీర్పుపై సినీ, సంగీత పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
