Trump Tariffs Refund: అమెరికాలో టారిఫ్ల వ్యవహారంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వానికి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టారిఫ్ల రూపంలో వసూలు చేసిన సొమ్మును దిగుమతిదారులకు తిరిగి చెల్లించాల్సిందేనని న్యూయార్క్లోని అధికారాల చట్టం కీలక తీర్పు వెలువరించింది.
1977లో అమలులోకి వచ్చిన అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) ఆధారంగా ట్రంప్ గతేడాది అనేక దేశాలపై భారీ సుంకాలు విధించారు. అయితే ఆ నిర్ణయాన్ని ఇప్పటికే సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ‘అట్మస్ ఫిల్ట్రేషన్’ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ట్రేడ్ కోర్టు న్యాయమూర్తి రిచర్డ్ ఈటన్ (Richard Eaton), టారిఫ్ల కారణంగా అదనంగా చెల్లించిన మొత్తాన్ని దిగుమతిదారులు తిరిగి పొందే హక్కు కలిగి ఉన్నారని స్పష్టం చేశారు.
ఈ రిఫండ్లకు సంబంధించిన కేసులను తానే పర్యవేక్షిస్తానని కూడా ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు గత తీర్పులో టారిఫ్లు చెల్లవని పేర్కొన్నప్పటికీ, ఇప్పటికే వసూలు చేసిన సొమ్ము తిరిగి ఇవ్వాలా లేదా అన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు. తాజా తీర్పుతో ఆ అంశంపై కొంత స్పష్టత వచ్చినట్లైంది.
ఇక అమెరికాలోకి దిగుమతయ్యే వస్తువులపై కస్టమ్స్ మరియు బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు విధించే సుంకాలు ‘లిక్విడేషన్’ అనే ప్రక్రియలో నమోదు అవుతాయి. ఈ సుంకాలపై అభ్యంతరం తెలపడానికి దిగుమతిదారులకు 180 రోజుల గడువు ఉంటుంది. ఆ గడువు ముగిసిన తర్వాత ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందే.
అయితే తాజా పరిణామాల నేపథ్యంలో సుంకాల వసూలు తాత్కాలికంగా నిలిపివేయాలని కోర్టు కస్టమ్స్ అధికారులను ఆదేశించింది. ఇప్పటికే లిక్విడేషన్ పూర్తైన వస్తువులను కూడా సుంకాలు లేకుండా మళ్లీ లెక్కించాలని సూచించింది.
ఇదిలా ఉండగా ప్రపంచ దేశాలపై 15 శాతం కొత్త సుంకాలు విధించే ప్రతిపాదన త్వరలో అమల్లోకి రావచ్చని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు.
ఈ తీర్పును ట్రంప్ తరఫు న్యాయవాదులు అప్పీల్ చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో అమెరికా టారిఫ్ విధానాలపై మరోసారి చర్చ ప్రారంభమైంది.
