
బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య ఘటన మరవకముందే, ఢిల్లీలో మరో సంఘటన చోటు చేసుకుంది. కేఫ్ యజమాని పునీత్ ఖురానా (40) తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. భార్య మానిక పహ్వా నుంచి విడాకులు తీసుకుంటున్నా, ఆమె తనను విడిచిపెట్టలేదని, రోజూ చిత్రహింసలకు గురిచేస్తోందని, తన జీవితం నరకంగా మారిందని చెప్పాడు.
ఆత్మహత్యకు ముందు పునీత్ సెల్ఫీ వీడియో తీసుకుని తన బాధలను వ్యక్తం చేశాడు. కోర్టు ముందు విడాకులకు సంబంధిత పత్రాలపై సంతకాలు చేసినా, ఆమె ఇంకా తనపై ఆర్థిక డిమాండ్లు పెడుతోందని, రూ. 10 లక్షలు అడుగుతోందని ఆరోపించాడు. కోర్టు ఇచ్చిన 180 రోజుల గడువులో 90 రోజులు పూర్తయినా, ఆమె వేధింపులు ఆగలేదని తన వీడియోలో వివరించాడు.
పునీత్ ఆత్మహత్యకు భార్య మానిక పహ్వా, ఆమె కుటుంబసభ్యులే కారణమని, వారు అతడిని ఆర్థికంగా, భావోద్వేగపరంగా చిత్రహింసలకు గురిచేశారని పునీత్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన కుమారుడు మౌనంగా ఈ హింసను భరించాడని, ఆ విషయం తమకు ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు.
పునీత్ ఆత్మహత్యకు సంబంధించిన 59 నిమిషాల వీడియోలో తన ఎదుర్కొన్న అన్ని హింసలను పునీత్ వివరించినట్టు తెలుస్తోంది. పునీత్ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.