కార్డన్ సెర్చ్ సమయంలో ఉద్రిక్తత
విజయవాడలో నగరంలో పోలీసులపై కాల్పుల యత్నం చోటుచేసుకుంది. బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్ వద్ద పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించేందుకు ప్రయత్నించారు.
ఈగల్ టీమ్పై కాల్పులకు ప్రయత్నం
అదే సమయంలో ఆ వ్యక్తి పోలీసులతో పాటు ఈగల్ టీమ్ అధికారులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పారిపోవడానికి ప్రయత్నించిన అతడిని వెంటాడి పట్టుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం నిందితుడు వరంగల్ కు చెందిన మురళిగా గుర్తించారు. అతడు ట్రిగ్గర్ నొక్కినా బుల్లెట్ ఛాంబర్లోకి రాకపోవడంతో కాల్పులు జరగలేదని అధికారులు తెలిపారు.
ఆపరేషన్ ‘వజ్ర ప్రహార్’లో భాగంగా తనిఖీలు
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న “ఆపరేషన్ ‘వజ్ర ప్రహార్”లో భాగంగా పోలీసులు, ఈగల్ టీమ్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి విచారణ చేపడుతున్నారు.