Home Andhra Pradesh KAKINADA ‘మిథాయ్’ తుపాను రేపు కాకినాడ తీరానికి..! ప్రభుత్వం అప్రమత్తం

‘మిథాయ్’ తుపాను రేపు కాకినాడ తీరానికి..! ప్రభుత్వం అప్రమత్తం

0

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా బలపడి ‘మిథాయ్’ తుపానుగా మారింది. ఇది రేపు మంగళవారం ఉదయం తీవ్ర తుపానుగా మారి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఈ తుపాను విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 710 కి.మీ, కాకినాడకు ఆగ్నేయంగా 680 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. దీని ప్రభావంతో ఈ రాత్రి నుంచే తీరప్రాంతాల్లో ఈదురుగాలులు, భారీ వర్షాలు ప్రారంభమయ్యే అవకాశముంది.

తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉంది. తక్షణ సహాయక చర్యల కోసం రూ.19 కోట్లు విడుదల చేసింది. సంబంధిత అధికారులందరి సెలవులను రద్దు చేసింది. తీర ప్రాంతాల్లోని 57 మండలాల్లో 219 తుపాను పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన 62 మెకనైజ్డ్ బోట్లను వెనక్కి రప్పించారు. పర్యాటకుల రాకపోకలను పూర్తిగా నిషేధించారు.

ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచారు — 9 ఎస్డీఆర్‌ఎఫ్‌, 7 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రభావిత జిల్లాలకు తరలించబడ్డాయి. తాగునీరు, ఆహారం, సహాయ శిబిరాల ఏర్పాటుకు అవసరమైన నిధులు విడుదల చేశారు. ముందుజాగ్రత్త చర్యగా అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో ఎల్లుండి వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కడప జిల్లాల్లో రేపటి వరకు, నెల్లూరు జిల్లాలో నేడు సెలవు ప్రకటించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. చేపల వేటకు సముద్రంలోకి వెళ్లకూడదని మత్స్యకారులకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ పరిస్థితులను బట్టి తుపాను తీవ్రతపై మరోసారి రాత్రి అప్‌డేట్ ఇవ్వనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version