ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రైలుప్రమాదం జరిగింది. రైల్వే పట్టాలు దాటుతున్న యాత్రికులను హౌరా–కల్కా నేతాజీ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో ఆరుగురు మహిళలు దుర్మరణం చెందారు.
కార్తిక పౌర్ణమి సందర్భంగా గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి యాత్రికులు చోపాన్ ప్రాంతం నుంచి వారణాసికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
అధికారుల వివరాల ప్రకారం, యాత్రికులు చోపాన్–ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్లో చునార్ రైల్వే స్టేషన్కు చేరుకున్న తర్వాత, ప్లాట్ఫాం వైపు కాకుండా రైలు పట్టాలపై దిగారు.
ఎదురుగా ఉన్న ప్లాట్ఫాం వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో హఠాత్తుగా వచ్చిన నేతాజీ ఎక్స్ప్రెస్ వారిని ఢీకొట్టింది.
ప్రమాదంలో ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన అధికారులను వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలనే ఆదేశాలు జారీ చేశారు.
రైల్వే శాఖ ఈ ఘటనపై విచారణ ప్రారంభించి, భద్రతా ప్రమాణాల అమలుపై సమీక్ష చేపట్టనుంది.
