UK Train Accident: బ్రిటన్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం పలువురిని విషాదంలోకి నెట్టింది. బెడ్ఫోర్డ్ ప్రాంతానికి సమీపంలో ఒకే మార్గంలో ప్రయాణిస్తున్న రెండు ప్రయాణికుల రైళ్లు ఢీకొనడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 80 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఒకరు లోకో పైలట్ కావడం మరింత విషాదాన్ని మిగిల్చింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, లండన్లోని సెయింట్ పాన్క్రాస్ ఇంటర్నేషనల్ స్టేషన్ వైపు వెళ్తున్న రెండు రైళ్లు సాయంత్రం సమయంలో ప్రమాదానికి గురయ్యాయి. ఢీకొన్న ప్రభావం తీవ్రంగా ఉండటంతో బోగీల్లో ప్రయాణిస్తున్నవారిలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవలు రంగంలోకి దిగాయి. అంబులెన్స్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఎయిర్ అంబులెన్స్తో పాటు ప్రత్యేక విపత్తు స్పందన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద సమయంలో రైలులో ఉన్న ప్రయాణికులు భయానక పరిస్థితులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఒక్కసారిగా భారీ కుదుపు రావడంతో పలువురు తమ సీట్ల నుంచి ముందుకు విసిరివేయబడ్డారని, బోగీల్లో పొగ వ్యాపించడంతో ప్రయాణికులు భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారని వెల్లడించారు. కొందరికి తీవ్ర గాయాలు, మరికొందరికి ఎముకలు విరిగినట్లు సమాచారం.
ఈ ఘటన కారణంగా లండన్ సెయింట్ పాన్క్రాస్కు వెళ్లే, అక్కడి నుంచి బయలుదేరే పలు రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
UK Train Accident | బ్రిటన్లో విషాదం.. ఎదురెదురుగా ఢీకొన్న రైళ్లు, పలువురికి గాయాలు
-








