Donald Trump: ఉక్రెయిన్ యుద్ధ చర్చల్లో భారత సైనికులను శాంతి పరిరక్షణ కోసం పంపాలన్న ఆలోచనపై ట్రంప్ స్పందన ఆసక్తికరంగా ఉందని ఓ పుస్తకం బయటపెట్టింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ ఆలోచనను ముందుకు తెచ్చినప్పటికీ, ట్రంప్ దాన్ని వెంటనే తిరస్కరించినట్లు రచయితలు పేర్కొన్నారు. ‘రెజీమ్ చేంజ్: ఇన్సైడ్ ది ఇంపీరియల్ ప్రెసిడెన్సీ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్’ అనే పుస్తకాన్ని న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులు మ్యాగీ హేబర్మన్, జోనాథన్ స్వాన్ రచించారు. వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్లో ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారంపై జరిగిన సమావేశాల్లో ఈ చర్చ చోటుచేసుకున్నట్లు అందులో వివరించారు.
కాల్పుల విరమణ అమలును పర్యవేక్షించేందుకు ఫ్రాన్స్, బ్రిటన్, నెదర్లాండ్స్ వంటి దేశాల శాంతి బలగాలను ఉపయోగించాలన్న ప్రతిపాదనపై చర్చ జరిగింది. అయితే నాటో దేశాల సైన్యాన్ని పంపితే రష్యాతో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని జేడీ వాన్స్ ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్ లేదా సౌదీ అరేబియా వంటి దేశాల సైన్యాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని వాన్స్ సూచించినట్లు పుస్తకంలో వెల్లడించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ “భారతీయులు అలా చేయరు, అలాంటి కార్యక్రమాల కోసం వారు డబ్బు ఖర్చు చేయరు” అని వ్యాఖ్యానించినట్లు రచయితలు తెలిపారు.
భారత్తో తనకు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ సైనిక చర్యల్లో భారత్ సాధారణంగా పాల్గొనదని ఆయన అభిప్రాయపడ్డారని పుస్తకం పేర్కొంది. అదే పుస్తకంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీపై ట్రంప్ విమర్శలు చేసిన అంశాలు కూడా ఉన్నాయి. జెలెన్స్కీ చర్చల్లో సమర్థవంతంగా వ్యవహరించలేని నాయకుడని ఆయన అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు.
అంతేకాకుండా వాణిజ్య విధానాలపై కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పుస్తకంలో చోటుచేసుకున్నాయి. అమెరికాలో ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయని దేశాలపై భారీ సుంకాలు విధించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నట్లు వెల్లడైంది. చైనా, భారత్ వంటి దేశాలపై అధిక టారిఫ్ల గురించి కూడా చర్చించినట్లు రచయితలు వివరించారు.








