సీతానగరం మండలంలోని అప్పయ్యపేట, రేపటి వలస, తామర కండి, గుచ్చుమి గ్రామాల గిరిజనులు, సన్నచిన్న రైతులు కొండ పోరంబోకు స్థలాల్లో జీవిస్తున్నారు. ఇక్కడి భూముల్లో డి పట్టాలతో బ్రతుకుతున్న వారు ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు.
ఫారెస్ట్ అధికారులు 1100 ఎకరాల కొండ ప్రాంతాన్ని ఏనుగుల జోన్గా ప్రకటించడం అన్యాయమని, ఇది గిరిజన గ్రామాలకు, చిన్న రైతులకు పెనుముప్పుగా మారుతుందని సిపిఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జీవనాధారం కోల్పోయే స్థితికి గ్రామస్తులు చేరుకున్నారని, వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏనుగుల జోన్ను ఇతర ఖాళీ ప్రాంతాలకు మార్చాలని, లేదంటే ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సిపిఎం నేతలు హెచ్చరించారు. తమ హక్కులను కాపాడుకునేందుకు రైతులు, గిరిజనులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఈ సమస్యను పరిష్కరించకపోతే రాస్తారోకోలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయం మార్చాలని స్థానిక నాయకులు స్పష్టం చేశారు.