Vanamahotsavam: మొక్కల పెంపకానికే పరిమితం కాని వనమహోత్సవం, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించే లక్ష్యంతో చేపట్టిన ఉద్యమమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గుర్రంగూడలో నిర్వహించనున్న వనమహోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
గతంలో చెరువుల ఆక్రమణలు, అటవీ భూములపై కబ్జాలు, నాలాల నిర్లక్ష్యం కారణంగా స్వల్ప వర్షాలకే హైదరాబాద్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు నెలకొన్నాయని సీఎం గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం చెరువుల పరిరక్షణ, నాలాల పునరుద్ధరణ, అటవీ భూముల సంరక్షణ కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని తెలిపారు.
వరదలతో అతలాకుతలమైన గుర్రంగూడ ప్రాంతాన్ని 2021లో పరిశీలించినప్పుడు కలిగిన ఆవేదనే, నేడు హరిత కార్యక్రమంగా రూపుదిద్దుకుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆక్రమణదారులపై న్యాయపోరాటం చేసి అటవీ భూములను కాపాడినట్లు వివరించారు.
హైదరాబాద్ను ప్రకృతి, పర్యావరణానికి అనుకూలమైన నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, గుర్రంగూడలో నిర్వహిస్తున్న వనమహోత్సవం ఆ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుందని సీఎం స్పష్టం చేశారు. నగర అభివృద్ధితో పాటు ప్రకృతి సంరక్షణకు సమాన ప్రాధాన్యం ఇస్తూ భవిష్యత్ తరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Vanamahotsavam | చెరువుల పరిరక్షణ, అటవీ భూముల రక్షణే లక్ష్యం.. వనమహోత్సవంపై సీఎం వ్యాఖ్యలు
-








