RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పెద్ద మొత్తంలో బంగారం అమ్మిందని వచ్చిన అంతర్జాతీయ మీడియా నివేదికలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. విదేశీ మారక నిల్వలను బలోపేతం చేసేందుకు ఆర్బీఐ తన వద్ద ఉన్న బంగారం నిల్వలను విక్రయించిందని బ్లూమ్బర్గ్ ప్రచురించిన నివేదికలు నిజానికి దూరంగా ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ఆరోపణలను తప్పుబడుతూ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో అధికారిక వివరణ విడుదల చేసింది. ఆర్బీఐ బంగారం అమ్మకాలు జరిపిందన్న సమాచారం పూర్తిగా అసత్యమని తెలిపింది.
బ్లూమ్బర్గ్ నివేదికలో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన దిగుమతుల ఖర్చు పెరిగిందని, అదే సమయంలో విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవడంతో డాలర్కు డిమాండ్ పెరిగిందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఫారెక్స్ నిల్వలను బలోపేతం చేయడానికి సుమారు 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారం విక్రయించారన్న అభిప్రాయం వ్యక్తం చేసింది.
అయితే కేంద్ర ప్రభుత్వం ఈ కథనాన్ని పూర్తిగా తిరస్కరించింది. ఆర్బీఐ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా తగ్గలేదని, పైగా పెరుగుదల నమోదైందని గణాంకాలతో సహా వివరించింది. 2025లో 13.92 శాతంగా ఉన్న బంగారం వాటా 2026 మార్చి నాటికి 16.70 శాతానికి పెరిగిందని, మే 22 నాటికి అది 16.85 శాతానికి చేరుకుందని వెల్లడించింది.
ఆర్బీఐ ప్రతి నెల విడుదల చేసే విదేశీ మారక నిల్వల బులెటిన్లో బంగారం నిల్వలకు సంబంధించిన పూర్తి వివరాలు స్పష్టంగా పొందుపరుస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం బంగారం నిల్వల్లో ఎటువంటి తగ్గుదల నమోదు కాలేదని స్పష్టం చేసింది. అందువల్ల ప్రజలు నిరాధారమైన, ధృవీకరించని వార్తలను నమ్మవద్దని కేంద్రం సూచించింది.








