Nara Lokesh: రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ విద్యా రంగంలో సమగ్ర మార్పులే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సమాజంలో గణనీయమైన మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే అత్యంత సవాలుగా భావించే విద్యాశాఖను ఎంచుకున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ బాధ్యతను ఒక ఛాలెంజ్గా స్వీకరించి ముందుకు సాగుతున్నానని తెలిపారు.
అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో పీ4 పథకం కింద దాతల సహకారంతో రూ.1.4 కోట్ల వ్యయంతో నిర్మించిన జెడ్పీ హైస్కూల్ కొత్త భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడిన మంత్రి, విద్యా వ్యవస్థలో గత రెండేళ్లలో అవసరమైన సంస్కరణలు పూర్తి చేశామని చెప్పారు. ఇకపై ప్రధాన దృష్టి విద్యార్థుల అభ్యసన ఫలితాలపై ఉండాలని సూచించారు.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామని, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఫార్మేటివ్, సమ్మెటివ్ పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యార్థుల ప్రతిభను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థుల కోసం బ్రిడ్జి కోర్సు మెటీరియల్ అందించనున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలల ఫలితాలను తొలిసారిగా పత్రికల్లో ప్రచారం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికారులు సమన్వయంతో పని చేస్తేనే ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సమస్యలు ఉంటే లీప్ యాప్ ద్వారా నేరుగా తెలియజేయవచ్చని చెప్పారు. విద్యార్థులతో మాట్లాడిన లోకేశ్, “మీరు బాగా చదివితే నాకు మంచి మార్కులు, లేకపోతే మైనస్ మార్కులు” అంటూ చమత్కరించారు.
విద్యార్థుల భవిష్యత్తే తన పనితీరును నిర్ణయిస్తుందని అన్నారు. విద్యార్థుల కోసం త్వరలోనే అదనపు విద్యా కిట్లు, బూట్లు అందజేస్తామని తెలిపారు. ఉపాధ్యాయులను గౌరవిస్తూ కష్టపడి చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.








