జియ్యమ్మవలస మండలం సుభద్రమ్మవలస సమీపంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. చింతపండుతో వెళ్తున్న ఓ లారీని అడ్డుకుని దాన్ని ధ్వంసం చేశాయి. లారీ అద్దాలను పగులగొట్టి, లోపల ఉన్న వస్తువులను చెల్లాచెదురు చేశాయి. గత కొన్ని రోజులుగా ఈ మార్గంలో ఏనుగుల కదలికలు ఎక్కువగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఏనుగుల గుంపు లారీవైపు విరుచుకుపడటంతో డ్రైవర్, క్లీనర్ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు వెంటనే లారీ నుంచి దూకి పరుగులు పెట్టారు. అదృష్టవశాత్తూ వారు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, ఏనుగుల దాడితో లారీ దెబ్బతినడంతో ఆర్థిక నష్టం సంభవించింది.
ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై ఏనుగులు తిష్ట వేసి ఉండటంతో ప్రజలు రాత్రివేళల్లో ప్రయాణించేందుకు భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఏనుగుల కదలికలపై నిఘా పెట్టేందుకు అటవీ శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి దాడులు జరగడంతో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సమీక్ష జరుగుతోంది.








