మహేశ్వరం నియోజకవర్గంలో తుక్కుగూడ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీపీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులు శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి (KLR) మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ను అవమానించడం అమిత్ షా అహంకారానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాలకు స్వాతంత్య్ర ఫలాలు అందించడమే ఆయన గొప్పతనమని గుర్తుచేశారు.
కార్యక్రమంలో దళిత, బహుజన నాయకులు, కాంగ్రెస్ నాయకులు కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ, అమిత్ షా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశంలోని బడుగు బలహీన వర్గాలను అపహాస్యం చేసే వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి.
ఈ నిరసనలో నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులతో పాటు, దళిత, బహుజన సంఘాల నాయకులు, అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెంటనే అమిత్ షా క్షమాపణ చెప్పాలని, మంత్రివర్గం నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేశారు.
