AP Inter Supplementary Results 2026: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న IPASE-2026 ఫలితాలు ఎట్టకేలకు గురువారం వెలువడ్డాయి. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా వెల్లడించారు. ఈ ఫలితాలు ప్రధాన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులతో పాటు మార్కులను మెరుగుపరుచుకోవడానికి బెటర్మెంట్ పరీక్షలు రాసిన వారికి వర్తిస్తాయి.
విద్యార్థులు తమ ఫలితాలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్(http://resultsbie.ap.gov.in) ద్వారా లేదా మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు. విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ పరీక్షల ద్వారా లక్షలాది మంది తమ ఫలితాలను మెరుగుపరుచుకున్నారని పేర్కొన్నారు.
మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరైన 2.29 లక్షల మందిలో 1.35 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ మార్కులను పెంచుకోగా, మరో 42 వేల మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి విద్యాభ్యాసాన్ని కొనసాగించే అవకాశం పొందారు. అలాగే రెండో సంవత్సరం పరీక్షలకు హాజరైన వారిలో కూడా గణనీయ సంఖ్యలో విద్యార్థులు తమ పనితీరును మెరుగుపరుచుకున్నారు. 57 వేల మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులై తదుపరి విద్యా దశలోకి అడుగుపెట్టారు.
ఈ సందర్భంగా విజయవంతంగా ఉత్తీర్ణులైన విద్యార్థులకు నారా లోకేష్ అభినందనలు తెలిపారు. పట్టుదల, కృషితో తమ ఫలితాలను మెరుగుపరుచుకున్న ప్రతి విద్యార్థి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యా ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి ముందుకు సాగాలని ఆయన సూచించారు.
AP Inter Supplementary Results 2026 | ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల
-








