Seafood Exports: సీ-ఫుడ్ ఎక్స్పోర్ట్స్ వర్క్షాప్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), ఏపీ ఆక్వా రంగం ప్రాముఖ్యతను మరియు బ్లూ ఎకానమీ ఆధారిత అభివృద్ధి అవకాశాలను వివరించారు. భవిష్యత్తు ఆర్థిక వృద్ధి అంతా సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థపైనే ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
బ్లూ ఎకానమీని కేవలం కాగితాలపై ఉన్న విధానంగా కాకుండా, సముద్ర వనరులను ఆధారంగా చేసుకుని బలమైన ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ఇన్నోవేటివ్ పెట్టుబడిదారులకు తాను ఎప్పుడూ ఒక ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కాకినాడ పోర్ట్ ఆధునీకరణకు సహకరిస్తామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రకటించడంపై సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే కేంద్ర మత్స్య శాఖ ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేవలం 15 రోజుల్లోనే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు గణాంకాలను ప్రస్తావిస్తూ, భారతదేశ సీ-ఫుడ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. దేశంలో మొత్తం చేపల ఉత్పత్తిలో ఏపీ 28 శాతం వాటాతో రెండో స్థానంలో ఉండగా, రొయ్యల ఉత్పత్తిలో 66 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉందని వివరించారు. సీ-ఫుడ్ ఎగుమతుల్లో కూడా 38 శాతం ఆదాయం ఒక్క ఏపీ నుంచే వస్తోందని పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఏటా సుమారు రూ.28,000 కోట్లకు పైగా ఎగుమతులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచ సీ-ఫుడ్ మార్కెట్లో భారతదేశ వాటా ఇంకా 5 శాతమే ఉన్నప్పటికీ, ఈ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. ఆక్వా రంగాన్ని మరింత బలోపేతం చేసి బ్లూ ఎకానమీని అభివృద్ధి చేయడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధికి ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించగలదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆవిష్కరణలు, పెట్టుబడులు పెరిగితే భారతదేశ బ్లూ ఎకానమీ ప్రపంచ స్థాయిలో మరింత బలంగా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆక్వా రంగంలో ఏపీ అగ్రస్థానం.. సీ-ఫుడ్ ఎక్స్పోర్ట్స్ వర్క్షాప్లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-








