ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ శ్రీలంకతో జరుగుతున్న గాలే టెస్టులో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్లో సెంచరీ నమోదు చేసి, టెస్టుల్లో 35వ శతకాన్ని సాధించాడు. విదేశాల్లో ఇది అతనికి 17వ శతకం, దీంతో విరాట్ కోహ్లీ 16 సెంచరీల రికార్డును అధిగమించాడు. ఈ ఘనత సాధించడం ద్వారా టెస్ట్ క్రికెట్లో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ టెస్టులో మరో అరుదైన మైలురాయిని కూడా స్మిత్ చేరుకున్నాడు. టెస్టు క్రికెట్లో 10,000 పరుగుల మార్క్ను అందుకున్నాడు. మొదటి రోజు తాను ఎదుర్కొన్న తొలి బంతికే పరుగుతో తన 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో ఈ ఘనత సాధించిన నాలుగో ఆస్ట్రేలియా క్రికెటర్గా నిలిచాడు.
స్మిత్ కంటే ముందు రికీ పాంటింగ్, స్టీవ్ వా, అలెన్ బోర్డర్ మాత్రమే ఈ రికార్డును అందుకున్నారు. మొత్తం 115 టెస్టుల్లో 55కి పైగా సగటుతో 10 వేల పరుగుల మైలురాయిని చేరడం విశేషం. ఇదే కాకుండా, కుమార సంగక్కర కంటే మెరుగైన సగటుతో (57.40) ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్గా నిలిచాడు.
ఈ ఘనత నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఫ్యాబ్ ఫోర్’గా పేరొందిన విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, జో రూట్, స్టీవ్ స్మిత్లలో ఈ తరం అత్యుత్తమ ఆటగాడు స్మిత్ అని పేర్కొన్నాడు.