తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా శుక్రవారం ఉదయాన్నే ఓ విషాద ఘటనకు వేదికైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో, మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో డీఎస్పీ స్వల్పంగా గాయపడగా, ఆయన వాహనం డ్రైవర్ రంగారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. డీఎస్పీ అధికారిక వాహనం ఇన్నోవా కారును ఎదురుగా వచ్చిన మరో వాహనం వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తరంలోనే వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ప్రమాద స్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి ఇద్దరినీ మహబూబ్నగర్ ఎస్వీఎస్ హాస్పిటల్కు తరలించారు.
డీఎస్పీ వెంకటేశ్వర్లు ముఖం, మోకాలికి గాయాలు కాగా, డ్రైవర్ రంగారెడ్డి పరిస్థితి కొంత విషమంగా ఉంది. డాక్టర్లు వెంటనే చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం డీఎస్పీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. డ్రైవర్కు కూడా అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవాహనం డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? వాహన వేగం ఎక్కువగా ఉండిందా? అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాథమిక వివరాల ప్రకారం, సీఎం పర్యటన ముగిసిన తర్వాత భద్రతా బలగాలు తమ తమ గమ్యస్థానాలకు తిరిగి వెళ్తున్న సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రత్యక్ష సాక్షుల మాటల ప్రకారం, ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండేదని, త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. ప్రభుత్వ వర్గాలు ఘటనపై సమాచారం సేకరిస్తున్నాయి. సీఎం భద్రతకు తోడ్పడే బలగాలకు విశ్రాంతి సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరగడం పట్ల కొంత ఆందోళన వ్యక్తమవుతోంది.
