‘మాస్ జాతర’ ఈవెంట్‌లో భీమ్స్ కన్నీళ్లు – “నన్ను రవితేజ కాపాడారు” భావోద్వేగ వ్యాఖ్యలు


మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 75వ చిత్రం ‘మాస్ జాతర’ ఈ నెల 31న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో చేసిన వ్యాఖ్యలు అందరినీ కదిలించాయి. జీవితంలో ఎదురైన కష్టాలను గుర్తుచేసుకుంటూ వేదికపైనే కన్నీటిపర్యంతమయ్యాడు భీమ్స్. తాను ఒకప్పుడు ఆత్మహత్యకు ప్రయత్నించే స్థితికి చేరుకున్నానని, ఆ సమయంలో రవితేజ దేవుడిలా వచ్చి తనను కాపాడారని చెప్పడం అక్కడున్న ప్రేక్షకుల హృదయాలను తాకింది.

భీమ్స్ మాట్లాడుతూ, “ఒకప్పుడు నేను పూర్తిగా జీవితంలో వెనుకబడిపోయాను. ఇంటి అద్దె ఎలా కట్టాలి, పిల్లలను ఎలా చదివించాలి, రేపు ఎలా బతకాలి అనే ప్రశ్నలతో విసిగి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. అదే సమయంలో పీపుల్స్ మీడియా నుంచి ఫోన్ వచ్చింది. ఆ కాల్ రావడానికి కారణం రవితేజ సార్. ఆయన లేకపోతే ఈరోజు నేను, నా కుటుంబం బతికి ఉండేవాళ్లం కాదు” అని గళం దద్దరిల్లేలా చెప్పారు.

తన భావోద్వేగాన్ని అదుపులో పెట్టుకోలేక భీమ్స్ కొనసాగిస్తూ, “ఆ సమయంలో రవితేజ సార్ నా పాలిట దేవుడిలా వచ్చారు. ఆయన ఇచ్చిన ఒక్క అవకాశం నన్ను తిరిగి బతికించింది. అమ్మా, నాన్నా… ఈరోజు మీ కొడుకు బతికున్నాడంటే కారణం రవితేజ సార్. ఆయన సినిమాలు అంటే నాకు ప్రాణం. నా ప్రేమను మాటల్లో కాదు, నా సంగీతంలో చూపిస్తాను. ఆయన నాకు దేవుడు” అంటూ కన్నీళ్లతో మాట్లాడారు.

భీమ్స్ ఈ ఎమోషనల్ స్పీచ్ తర్వాత రవితేజ హాస్యంగా స్పందిస్తూ, “భీమ్స్, ఇంత ఎమోషన్ ఏంటయ్యా నువ్వు… నీ ఎమోషన్ తగలెయ్యి! స్క్రీన్ మీద నువ్వు సౌండ్‌తో ఇరగదీసేశావ్. సినిమా అద్భుతంగా ఉంది” అని చెప్పి వేదికను నవ్వుల మయం చేశారు.

యంగ్ రైటర్ భాను బొగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘మాస్ జాతర’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్, ఎంటర్టైన్‌మెంట్, భావోద్వేగాలతో నిండిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *