జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి మాటలు జోక్లా ఉన్నాయంటూ విమర్శించిన ఆయన,గత ఎన్నికల్లో వచ్చిన 25 వేల ఓట్లు ఈసారి 10 వేలకీ చేరవని ఎద్దేవా చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్లు కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపిస్తూ, ఇరుపార్టీల నిజ స్వరూపం బయటపడిందన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా 10 ఏళ్లుగా ఉన్న కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఏం చేశారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తోందని, అభివృద్ధి కోసం కృషి చేస్తోందని తెలిపారు.తమ అభ్యర్థి విజయం ఖాయమని, అందుకు పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజలు మోసపూరిత రాజకీయాలకు లొంగరని, అభివృద్ధి, నిజాయితీ, సేవల పట్ల నిబద్ధత కలిగిన కాంగ్రెస్కే ఓటు వేస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
