తిరుమలలోని విశాఖ శారదా పీఠానికి టీటీడీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఈ పీఠం గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఒక భవనాన్ని నిర్మించినట్టు తేలింది. దీనిపై హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. విచారణ అనంతరం హైకోర్టు టీటీడీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పుతో టీటీడీ వెంటనే చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగింది. శారదా పీఠం నిర్మించిన అక్రమ భవనాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలపై ఉల్లంఘన చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది.
తాజాగా టీటీడీ ఎస్టేట్ విభాగం నుంచి శారదా పీఠానికి అధికారిక నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులో పదిహేను రోజుల్లోగా భవనాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. అలాగే ఆ భవనాన్ని టీటీడీకి అప్పగించాల్సిందిగా పేర్కొంది.
ఈ పరిణామంతో తిరుమలలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇతర అక్రమ నిర్మాణాలపై కూడా టీటీడీ దృష్టి సారించే అవకాశం ఉంది. మతపీఠాలపై కూడా ఒకే నిబంధనలను అమలు చేయాలన్న టీటీడీ వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది.
