సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు ఊరట అందించింది. రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చింది. మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య పరస్పర ఫిర్యాదులు నమోదవ్వడంతో పోలీసులు ఇరువురికి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై మోహన్ బాబు స్టే ఇవ్వాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్ను విచారించిన హైకోర్టు, రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే ఇచ్చింది. తదుపరి, మోహన్ బాబు పోలీసుల ముందు విచారణకు ఈ నెల 24వ తేదీ వరకు మినహాయింపును అందజేసింది. జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించి, తదుపరి విచారణను 24వ తేదీకి వాయిదా వేసింది.
మోహన్ బాబు పై నమోదైన కేసులను ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు వివరించారు. పరస్పర ఫిర్యాదులతో కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కోర్టు, నిన్న సాయంత్రం జర్నలిస్ట్పై దాడి కేసులో మోహన్ బాబు పై మరో క్రిమినల్ కేసు నమోదైందని పేర్కొంది. ఈ కేసులో పోలీసుల నోటీసులను అందుకున్న మంచు మనోజ్ ఈ రోజు విచారణకు హాజరయ్యారని కోర్టుకు తెలియజేశారు.
మోహన్ బాబు ఇంటి వద్ద గస్తీ ఏర్పాటు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే, ప్రభుత్వం తరఫు న్యాయవాది నిత్యం గస్తీ ఏర్పాటు చేయడం కుదరదని తెలిపారు. అయితే, రెండు గంటలకోసారి పోలీసులు అక్కడి పరిస్థితులను గమనించి వస్తారని చెప్పారు. దీనితో, హైకోర్టు రెండు గంటలకోసారి పోలీసులు మోహన్ బాబు ఇంటి వద్దకు వెళ్లాలని ఆదేశించింది.
