వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ పై ఆ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర హోం మంత్రి అనిత తప్పుబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని తిడితే బీపీ పెరిగి దాడి చేశారని చెప్పిన జగన్, ఇప్పుడు వంశీ అరెస్ట్ పై నీతి కబుర్లు చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు.
వంశీ దళితుడిని భయపెట్టి కిడ్నాప్ చేయించారని అనిత ఆరోపించారు. డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడి జరిగినా పోలీసుల నుంచి రక్షణ లేకపోయిందని విమర్శించారు. అన్ని ఆధారాలతోనే వంశీని అరెస్ట్ చేసి జైలుకు పంపించామని, పులివెందుల ఎమ్మెల్యే జగన్ దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు.
గత ఐదేళ్లుగా టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం లెక్కలేనన్ని తప్పుడు కేసులు పెట్టిందని అనిత ఆరోపించారు. కక్ష తీర్చుకోవాలని టీడీపీ అనుకుంటే ఇంత సమయం ఎందుకు తీసుకోవాల్సి వస్తుందని ప్రశ్నించారు. నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించారు.
పోలీసులు న్యాయవ్యవస్థకు గౌరవం ఇవ్వాలంటే, న్యాయవాదులకు కూడా పోలీసులు గౌరవం ఇవ్వాలని అనిత అన్నారు. అప్పుడు మాత్రమే న్యాయ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని అభిప్రాయపడ్డారు. నిందితులపై ఆధారాలు సేకరించడంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.