భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ఇప్పుడు బ్రిటన్ రాజధాని లండన్కు పాకాయి. ఇరు దేశాలకు చెందిన ప్రవాసులు లండన్ వీధుల్లో పరస్పరం నిరసనలకు దిగుతుండటంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో, లండన్లోని పాకిస్థాన్ హైకమిషన్పై దాడి చేసి, కిటికీ అద్దాలు ధ్వంసం చేశారన్న ఆరోపణలపై భారత సంతతికి చెందిన వ్యక్తిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు.
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించిన విషయం తెలిసిందే. ఈ దాడి ప్రభావం లండన్లోని ప్రవాసులపైనా పడింది. మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపినట్లుగా, ఆదివారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో లౌండెస్ స్క్వేర్లోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయం కిటికీలను ఒక వ్యక్తి ధ్వంసం చేశాడు.
వెంటనే స్పందించిన పోలీసులు, ఘటనకు బాధ్యుడిగా భావించిన 41 ఏళ్ల అంకిత్ లవ్ను అరెస్ట్ చేశారు. అతనిపై క్రిమినల్ డ్యామేజ్ కింద కేసు నమోదు చేసినట్లు మెట్రోపాలిటన్ పోలీసు ప్రతినిధి చెప్పారు. నిందితుడి నిర్దిష్ట చిరునామా లేదని, అతన్ని సోమవారం (ఏప్రిల్ 28) వెస్ట్మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు.
పాకిస్థాన్ ప్రేరేపిత సరిహద్దు ఉగ్రవాదాన్ని నిరసిస్తూ లండన్లోని భారతీయ సంఘాలు శుక్రవారం నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. అయితే, భారత నిరసనకారుల నినాదాలను అడ్డుకునేందుకు పాకిస్థానీ ప్రవాసులు లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తాజా పరిణామాలతో, లండన్లో ఇరు దేశాల ప్రవాసుల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశం ఉంది.
