భారతదేశంలో ప్రధాన నగరాలను బుల్లెట్ రైలు ద్వారా అనుసంధానించే ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. తాజాగా, హైదరాబాద్-ముంబై మధ్య 709 కిలోమీటర్ల హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మించేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు బెంగళూరు, చెన్నై వరకూ విస్తరించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో, హైదరాబాద్ నుంచి ఈ నగరాలకు వెళ్లేందుకు కావలసిన సమయం చాలా తగ్గిపోతుంది.
ప్రస్తుతం, ముంబై-అహ్మదాబాద్ మధ్య జపాన్ సాంకేతికతతో హైస్పీడ్ రైలు నిర్మాణం జరుగుతోంది. ఈ మార్గంలో జపాన్ తయారీ బుల్లెట్ రైలు నడవనుంది. తర్వాతి దశలో మరిన్ని హైస్పీడ్ రైల్ కారిడార్లను నిర్మించనున్నారు. వాటిలో హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై మార్గాలు కూడా ఉన్నాయి. ఈ మార్గాలు ఎలివేటెడ్, భూగర్భ మార్గాల్లో నిర్మించబడతాయి.
ప్రస్తుతం, హైదరాబాద్-బెంగళూరు మధ్య 618 కిలోమీటర్ల దూరం కోసం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లలో 11 గంటల సమయం పడుతుంది, కానీ బుల్లెట్ రైలు 2 గంటల్లో చేరుకునే వీలుంది. అలాగే, హైదరాబాద్-చెన్నై మధ్య 757 కిలోమీటర్ల దూరం 15 గంటలు పడుతుంది. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఈ సమయం 2.5 గంటలకు తగ్గిపోతుంది.
ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి కావడానికి 10 నుంచి 13 సంవత్సరాలు పడుతాయని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.