జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి , వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, వైస్ చైర్మన్ కొల్లూరి నరసింహులు మార్కెట్ డైరెక్టర్ లను శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సన్మానించి వారిని అభినందించారు.
అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ…..
జనగామ జిల్లాకు దేవాదుల ప్రాజెక్టు వరప్రదాయని అని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి స్పష్టం చేసారు. దేవాదుల ప్రాజెక్టుతో జనగామ జిల్లా రూపు రేఖలు మార్చించిందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక ధాన్యం దిగుబడి జనగామ జిల్లాలోనే జరుగుతుందని అది దేవాదుల ప్రాజెక్టు వల్లే సాధ్యం మైందన్నారు. కాంగ్రెస్ పార్టీ పాటిష్టానికి, జనగామ జిల్లా అభివృద్ధికి నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. గత పాలనలో అభివృద్ధిని పక్కన పెట్టి కమిషన్లకు కక్కుర్తి పడ్డారని విమర్శించారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని పాటిష్టం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రతిపక్షాలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్….
బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు అమాయకులైన విద్యార్థులను, నిరుద్యోగులను అడ్డు పెట్టుకుని అనవసరమైన ఆందోళనలు చేస్తూ వారిని పెడదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆగ్రహంవ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పైన, సీఎం రేవంత్ రెడ్డి పై బీజేపీ, బీఆర్ ఎస్ ముప్పేట దాడి చేయడం సరికాదని అన్నారు. 10 ఏండ్లు అధికారంలో ఉన్న బీ ఆర్ ఎస్ ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. బీఆర్ ఎస్ లో హరీష్ రావు, కేటీఆర్ మధ్యలో పోటీ ఏర్పడిందన్నారు. పేపర్లలో, టివి ఛానల్ లో పోటీ పడిమరి పెయిడ్ ఆర్టికల్స్, రాయించుకుంటున్నారని అన్నారు. ఒకరిని చూసి ఒకరు ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. 10ఏళ్లలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకున్నారు. 2014లో కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎన్ని…. ఈ రోజు మీ ఆస్తులు ఎన్ని బయట పెట్టాలి. మీరు నిజాయితీ పరులు అయితే…. తెలంగాణ ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే వెంటనే ఆస్తుల వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేసారు.
బీజేపీకి ఏ హక్కుఉందని మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండి పడ్డారు. బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి అనే విషయం మర్చిపోయి రోడ్డు పై కూర్చొని ధర్నా చేయడానికి సిగ్గుండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కనీసం 2 వేల ఉద్యోగాయాలు కూడా ప్రకటించ లేదన్నారు. బీజేపీ నాయకులు ఒకరు హైడ్రా ను సమర్ధిస్తే, మరొకరు విమర్శిస్తున్నారని, ఒకరు మూసి ప్రక్షాళన చేయాలంటూ మరొకరు వద్దంటూ మాట్లాడడం వారిలో వారికి క్లారిటీ లేదని ఎద్దేవాచేశారు. ఏ ఒక్క ప్రాజెక్టును తెలంగాణకు తీసుకురాలేని నాయకులు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్యే మండి పడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సంకల్పనికి తోడుగా నిలబడాలని పిలుపునిచ్చారు. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
రైతులకు మార్కెట్ నిధుల నుండి 5రూపాయలకు మధ్యాహ్న భోజనం అందించాలని అన్నారు. రైతులకు విశ్రాంతి భవనం, ఇంటర్నల్ సిసి రోడ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. మార్కెట్ అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు అన్నారు.
*వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ…
నూతన పాలక మండలికి వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య శుభాకాంక్షలు తెలియజేశారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన వ్యవసాయ మార్కెట్ కమిటీ జనగాం పాలకమండలి రైతుకు అండగా నిలబడి మెరుగైన సేవలు అందించాలన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఈ మార్కెట్లో రైతులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, మార్కెట్ ను అన్ని విధాలుగా తీర్చిదిద్దాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రైతులకు అండగా నిలుస్తుందని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. రైతుని రుణ విముక్తిని చేయాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని స్పష్టం చేశారు. భారతదేశంలో మొదటిసారిగా 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ఇప్పటికీ 23 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసిందని పేర్కొన్నారు. డిసెంబర్ 9 2024 వరకు సోనియాగాంధీ పుట్టినరోజు వరకు మొత్తం 42 లక్షల మంది రైతులకు 31 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేయాలని ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్ట పడి పని చేసే ప్రతీ ఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని అన్నారు. తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండాను బలంగా పాతే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రతిపక్షలకు కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది…చేసేదే చెప్తుందని అన్నారు. జనగామ మార్కెట్ పెద్దదని, మార్కెట్ కమిటీ పై బాధ్యతలు కూడా పెద్దగానే ఉంటాయన్నారు. మార్కెట్ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎంపీ డా. కడియం కావ్య పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

 
				 
				
			 
				
			