పుష్కర్ పశు ప్రదర్శనలో సంచలనం – ₹15 కోట్ల షాబాజ్ గుర్రం, ₹23 కోట్ల అన్మోల్ గేదె ఆకర్షణ


రాజస్థాన్‌లోని ప్రసిద్ధ పుష్కర్ క్యాటిల్ ఫెయిర్ ఈసారి అద్భుతమైన పశువులతో దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. దేశం నలుమూలల నుండి రైతులు తమ విలువైన పశువులను ఈ ప్రదర్శనకు తీసుకువచ్చారు. వాటిలో చండీగఢ్‌కు చెందిన రైతు తీసుకువచ్చిన గుర్రం ‘షాబాజ్’ మరియు రాజస్థాన్‌కు చెందిన రైతు గేదె ‘అన్మోల్’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

రెండున్నరేళ్ల వయస్సు కలిగిన షాబాజ్ గుర్రం ఇప్పటికే పలు బహుమతులు సాధించింది. ఈ గుర్రం ధర ఏకంగా ₹15 కోట్లుగా చెబుతున్నారు. ప్రదర్శనలో కొనుగోలుదారులు ₹9 కోట్ల వరకు ఇచ్చేందుకు సిద్ధమైనప్పటికీ, రైతు ఆ ధరకు అమ్మకానికి ఒప్పుకోలేదు. ఈ గుర్రం బ్రీడ్‌కు ఒక్క సారి రూ.2 లక్షల వరకు ధర పలుకుతోందని నిర్వాహకులు తెలిపారు.

ఇక నలుపు రంగులో మెరిసే రాజస్థానీ గేదె ‘అన్మోల్’ ఈ ప్రదర్శనలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. ఈ గేదెకు రైతు ప్రతిరోజూ పాలు, నెయ్యి, డ్రైఫ్రూట్స్‌తో ప్రత్యేక ఆహారం ఇస్తున్నట్లు చెప్పారు. దీనికి రూ.23 కోట్ల విలువ నిర్ణయించబడింది. ఈ రెండు పశువులు పుష్కర్ ఫెయిర్‌లో సందర్శకుల దృష్టిని ఆకర్షించడమే కాకుండా, సోషల్ మీడియాలో కూడా విపరీతమైన చర్చనీయాంశంగా మారాయి.

పుష్కర్ పశు ప్రదర్శన ప్రతి సంవత్సరం జరిగే అద్భుతమైన ఈవెంట్‌గా ప్రసిద్ధి చెందింది. ఈసారి షాబాజ్ మరియు అన్మోల్ వంటి ఖరీదైన పశువులు పాల్గొనడంతో ఈ ఫెయిర్ మరింత గ్లామర్‌ను సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *