పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. లష్కరే తాయిబా కమాండర్ ఫరూక్ అహ్మద్ ఈ దాడికి ప్రధాన సూత్రధారి అని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు వెల్లడించారు. అతడి స్లీపర్ సెల్ నెట్వర్క్ ద్వారా గత రెండేళ్లుగా పలు ఉగ్రదాడులు నిర్వహించినట్టు వారు గుర్తించారు.
ఫరూక్ అహ్మద్ ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ఉంటున్నట్టు ఎన్ఐఏ వర్గాలు అనుమానిస్తున్నాయి. అతను పర్వత మార్గాలపై దిట్టగా ఉన్నాడు. ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించి కశ్మీర్లోకి ఉగ్రవాదులను చొరబాటు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
ఇటీవల కుప్వారా జిల్లాలోని ఫరూక్ అహ్మద్ ఇంటిని భద్రతా బలగాలు కూల్చివేశాయి. ఉగ్రవాదులకు ఆశ్రయంగా ఉండే ఇళ్లను కూల్చివేసే చర్యల్లో ఇది ఒక భాగమని అధికారులు తెలిపారు. అతడి ఇంటి నుంచే పలువురు ఉగ్రవాదులకు మద్దతు లభించిందని సమాచారం.
పాకిస్థాన్ నుంచి ముగ్గురు ప్రధాన సెక్టార్ల ద్వారా ఉగ్రవాదుల చొరబాటుకు అహ్మద్ కీలకంగా సహకరిస్తున్నట్టు గుర్తించారు. పహల్గామ్ దాడితోపాటు మరో రెండు ఉగ్రదాడుల్లోనూ అతడి ప్రమేయం ఉందని అనుమానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే అతడి గురించి సమాచారం కోసం ఇంటెలిజెన్స్ నెట్వర్క్ చర్యలు ముమ్మరం చేసింది.
