దావోస్లోని బెల్వేడేర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా లూసియర్తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కీలక రంగాల్లో స్విస్ పెట్టుబడులు తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోకేష్ తెలిపారు. ముఖ్యంగా సాంకేతిక వస్త్రాలు, యంత్రాల తయారీ, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు విడిభాగాల తయారీ, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాల పరిశ్రమల్లో పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.
TEPA (ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్) ద్వారా ఆంధ్రప్రదేశ్కు చెందిన తయారీదారులను యూరోపియన్ మార్కెట్కు కనెక్ట్ చేయడానికి సహకరించాలని మంత్రి లోకేష్ కోరారు. ఇంజనీరింగ్, హెల్త్ సైన్స్, రెన్యువబుల్ ఎనర్జీ రంగాల్లో పరిశోధనకు సహకారం అవసరమని తెలిపారు. విశ్వవిద్యాలయాలు, ఆర్అండ్డి హబ్లతో పాటు స్థానిక పరిశ్రమలతో భాగస్వామ్యం ఏర్పరచుకునేందుకు ఆసక్తి ఉందన్నారు.
క్రిస్టెల్లా మాట్లాడుతూ… స్విట్జర్లాండ్ స్తూల జాతీయోత్పత్తిలో తమ కాంటన్ 11 శాతం వాటా కలిగి ఉందని తెలిపారు. నెస్లే, ఫిలిప్ మోరీస్, మెడ్ ట్రానిక్స్, లాజిటెక్ ఇంటర్నేషనల్, డెబియోపామ్ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు తమ ప్రాంతంలో గ్లోబల్ లీడర్స్గా ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు స్విస్ కంపెనీలు ఆసక్తి చూపేలా ప్రోత్సహించేందుకు సహకరించనున్నామని హామీ ఇచ్చారు.
స్విస్ కంపెనీల పెట్టుబడులు రాష్ట్రానికి గొప్ప అవకాశాలని మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు. పరిశ్రమలకు అనుకూలమైన విధానాలతో స్విస్ సంస్థలు మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, పరిశోధన సహకారాన్ని మరింత బలపరచేందుకు కలిసి పని చేస్తామని తెలియజేశారు.