విజయవాడ దుర్గమ్మ ఆలయంలో వైభవంగా దసరా ఉత్సవాలు


విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రి క్షేత్రం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో ఆధ్యాత్మికతను సంతరించుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనంతో తృప్తి పొందుతున్నారు. ముఖ్యంగా ఉత్సవాల్లో అత్యంత పవిత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ విశేష ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూడటానికి భక్తులతో పాటు పలువురు ప్రముఖులు ఆలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయ ప్రాంగణానికి చేరుకున్న డీకే శివకుమార్‌కు వేద పండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇది నా భాగ్యం. ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం అద్భుతంగా ఉంది. భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు శ్లాఘనీయం” అని అన్నారు.

ఆలయం మొత్తం వేడుకలతో నిండిపోయి, ఘనంగా అలంకరించబడి ఉన్న దృశ్యాలు భక్తులను మరింత భక్తిశ్రద్ధలతో ముంచెత్తుతున్నాయి. ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను శ్రద్ధగా నిర్వహించి భక్తులకు భద్రత, నీటివసతి, ప్రసాదాలు, దర్శన సౌకర్యాల కల్పనలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.

అలాగే రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి మార్గంలో దూసుకుపోతుంది. ప్రజల సంక్షేమం కోసం తీసుకుంటున్న కార్యక్రమాలు విజయవంతంగా అమలవ్వాలని అమ్మవారిని ప్రార్థించాం. ఆయనకు ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం” అన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ దసరా ఉత్సవాలు ఒకవైపు సాంస్కృతిక సంపదను, మరోవైపు ప్రజల ఐక్యతను ప్రతిబింబిస్తున్నాయి. అమ్మవారి దర్శనానికి ఎటు చూసినా నడిరోడ్లపైనే క్యూ లైన్లతో భక్తుల భక్తి భావం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఆలయ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు నిర్వహించడంతో దర్శనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *