ముంబై–న్యూయార్క్ ఎయిరిండియా విమానం సాంకేతిక లోపంతో వెనక్కి మళ్లింపు


ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియాను సాంకేతిక లోపాలు వదలడం లేదు. తాజాగా ముంబై నుంచి అమెరికాలోని న్యూయార్క్ వెళ్లాల్సిన ఏఐ191 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో ముంబైకి తిరిగి చేరుకుంది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం, ఎయిరిండియా ఏఐ191 విమానం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొద్ది సేపటికే సిబ్బంది సాంకేతిక లోపాన్ని గుర్తించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించాలని నిర్ణయించారు. దాంతో విమానం ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనతో ప్రయాణికులు గందరగోళానికి గురైనా, ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

తరువాత ఎయిరిండియా అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, “ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని వెనక్కి మళ్లించాం. ప్రస్తుతం విమానంపై సాంకేతిక తనిఖీలు జరుగుతున్నాయి. ప్రయాణికుల భద్రత మా ప్రాధాన్యత” అని పేర్కొంది. ఈ విమానం తిరిగి రావడం వల్ల న్యూయార్క్ నుంచి ముంబైకి రావాల్సిన ఏఐ144 ఫ్లైట్‌ను కూడా రద్దు చేయాల్సి వచ్చిందని వెల్లడించింది.

గత కొద్ది నెలలుగా ఎయిరిండియా విమానాల్లో ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకోవడం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. గతవారం మిలాన్‌లో జరిగిన ఘటన తాజాగా గుర్తుకు వస్తోంది. అక్టోబర్ 17న మిలాన్ విమానాశ్రయంలో ఢిల్లీకి బయల్దేరాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో 250 మందికి పైగా ప్రయాణికులు రెండు రోజుల పాటు అక్కడే చిక్కుకుపోయారు. వారికి హోటల్ వసతి, భోజనం వంటి సౌకర్యాలు కల్పించి, ప్రత్యేక విమానంలో స్వదేశానికి తరలించారు.

అదేవిధంగా, ఆగస్టు 16న కూడా ముంబై–న్యూయార్క్ మార్గంలోనే మరో ఎయిరిండియా విమానం సాంకేతిక కారణాలతో రద్దయింది. ఇలాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకోవడంతో ఎయిరిండియా నిర్వహణా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని విమానయాన నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *