బాణాసంచా పేలుడు ఘోరం: కోనసీమలో దంపతుల దుర్మరణం – గతేడాది నిల్వచేసిన మందుగుండు సామాగ్రి మరణానికి దారి


అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఐనవిల్లి మండలం పరిధిలోని విలాస గ్రామం లో చోటుచేసుకున్న విషాద ఘటన స్థానికులను తీవ్ర విషాదంలో ముంచింది. గతేడాది నిల్వ ఉంచిన మందుగుండు పదార్థాలు (బాణాసంచా) తీయడంలో జరిగిన ఘోర పేలుడు, ఓ కుటుంబాన్ని అర్ధాంతరంగా కూల్చేసింది. ఈ ప్రమాదంలో ఓ దంపతులు శవాలుగా మారారు, ఇల్లు శిథిలావస్థకు చేరింది.

పోలీసుల కథనం ప్రకారం — గ్రామానికి చెందిన కంచర్ల శ్రీనివాస్ (55) మరియు ఆయన భార్య సీతామహాలక్ష్మి (50) తమ ఇంట్లో గత సంవత్సరం దీపావళి ఉత్సవాల కోసం నిల్వ చేసిన బాణాసంచాను బయటకు తీయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఆ పేలుడు తీవ్రతకు ఇంటి గోడలు కూలిపోయి, ఆ దంపతులు శిథిలాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు.

పేలుడు ధాటికి ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం ఉలిక్కిపడింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, పీ.గన్నవరం సీఐ భీమరాజు నేతృత్వంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద పడిన మృతదేహాలను వెలికితీయడంతోపాటు, పేలుడు ఎలా జరిగిందన్న దానిపై విచారణ ప్రారంభించారు.

ఈ ఘటనపై స్పందించిన కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా స్వయంగా సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, పేలుడు జరిగిన స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు. పోలీసు దర్యాప్తులో ప్రమాదానికి గల గల కారణాలు, బాణాసంచా నిల్వ ఉంచడం పై నిబంధనలు ఉల్లంఘించారా అనే కోణంలో విచారణ సాగుతోంది.

ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా నివారించేందుకు, బాణాసంచా నిల్వ, సరఫరా, వినియోగంపై కఠిన నియంత్రణలు అవసరమన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రతి ఇంట్లోనూ ఉపయోగించే బాణాసంచా వంటి పదార్థాలను జాగ్రత్తగా, చట్టబద్ధంగా నిర్వహించాల్సిన అవసరాన్ని ఈ దుర్ఘటన మరలా గుర్తు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *