దేశ రాజధాని ఢిల్లీ, తెలుగు సాంస్కృతిక వైభవంతో చుట్టుముట్టుకుంది. ఢిల్లీ యూనివర్సిటీలోని రామ్ జస్ కాలేజీ మైదానంలో తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ (టీఎస్ఏ) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ వేడుకకు నాలుగు వేల మందికి పైగా తెలుగు విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఈ సంబరానికి ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ పూజలో పాల్గొన్నారు. అలాగే, ప్రముఖ పారిశ్రామికవేత్త, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్, స్టార్ హీరో రాంచరణ్ భార్య ఉపాసన కామినేని గౌరవ అతిథిగా విచ్చేసి వేదికను ముఖ్యంత్రితో కలిసి పంచుకున్నారు. జ్యోతి ప్రజ్వలనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఉపాసన మాట్లాడుతూ, “బతుకమ్మ పండుగ కేవలం పూల పండుగ మాత్రమే కాదు, ఇది మహిళా శక్తి, సామాజిక ఐక్యత మరియు సృజనాత్మకతకు ప్రతీక. దసరా స్ఫూర్తితో ముడిపడి ఉన్న ఈ పండుగ ఉత్సాహాన్ని, విజయాన్ని సూచిస్తుంది” అని చెప్పారు. ఢిల్లీలో తెలుగు యువత సంప్రదాయాలను ఈ విధంగా ఉల్లాసంగా నిర్వహించడం గర్వంగా ఉందని అభినందించారు. అలాగే, తెలంగాణ సంస్కృతిని గౌరవించినందుకు ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
టీఎస్ఏ అధ్యక్షుడు వివేక్ రెడ్డి, సలహాదారు కార్తీక్ రెడ్డి పర్యవేక్షణలో ఈ వేడుక అద్భుతంగా సాగింది. సంప్రదాయ పూజలు, బతుకమ్మ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు పాల్గొనేవారిని మురిపించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉపాసనను నిర్వాహకులు శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.
దసరా పండుగ వాతావరణంలో జరిగిన ఈ బతుకమ్మ వేడుక, ఢిల్లీలోని తెలుగు విద్యార్థుల ఐక్యతను, సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ కార్యక్రమం తెలుగు భాష, సంస్కృతి ప్రతిష్ఠను దేశ రాజధానిలో మరింత ప్రాచుర్యం పొందేలా చేసింది.