జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేసారు.ప్రచారం ముగియకముందే ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలవాలని, ఈ మూడు రోజులు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంత్రులకు సూచించారు. ప్రచారం 9న ముగియనుండటంతో ఒక్క రోజును కూడా వృథా చేయకూడదని స్పష్టం చేశారు.
గురువారం నిర్వహించిన సమీక్షలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్తో పాటు మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ALSO READ:రాష్ట్రంలో డిజిలాకర్ తరహా వ్యవస్థ రానుంది: డేటా ఆధారిత పాలనపై సీఎం చంద్రబాబు దృష్టి
సమావేశంలో ప్రచార వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ప్రతిపక్ష దుష్ప్రచారాలపై చర్చ జరిగింది. పోలింగ్ బూత్ వారీగా సర్వే నివేదికలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై సీఎం సమీక్షించారు.
రేవంత్రెడ్డి మాట్లాడుతూ – “ప్రతి కాలనీ, బస్తీ, మురికివాడల్లోకి వెళ్లి స్థానిక సమస్యలను తెలుసుకోండి, పరిష్కార హామీ ఇవ్వండి. ప్రభావశీలమైన సామాజిక వర్గాలతో సమావేశాలు జరిపి కాంగ్రెస్కు మద్దతు కూడగట్టండి. మీకు కేటాయించిన డివిజన్లలో విస్తృతంగా ప్రచారం చేయండి” అని మంత్రులకు సూచించారు.

అలాగే, ప్రచారంలో ఉన్న మంత్రులు, ప్రభుత్వ విప్లు, నాయకులతో ఫోన్లో మాట్లాడి తాజా సమాచారం తెలుసుకున్నారు. ఓటర్ల జాబితాలో తలెత్తిన లోపాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న అసత్య ప్రచారాలను సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు.
సీఎం రేవంత్రెడ్డి చివరగా పేర్కొంటూ — “ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించండి. గత బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియజేయండి.
ప్రతి ఓటరిని మనవైపు తిప్పుకోవడం ఇప్పుడు అత్యంత కీలకం” అని మంత్రులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
