జగన్ సంచలన ఆరోపణలు.. బాలయ్య తాగి అసెంబ్లీలో మాట్లాడారని వ్యాఖ్య


ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరోసారి నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. మెగాస్టార్ చిరంజీవిపై అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బాలకృష్ణ మద్యం సేవించి అసెంబ్లీకి వచ్చారని, ఆయన మానసిక ఆరోగ్యం సరిగాలేదని సంచలన ఆరోపణలు చేశారు. తాగి మాట్లాడే వ్యక్తిని సభలోకి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించిన జగన్, అలా మాట్లాడేందుకు అనుమతించిన స్పీకర్‌కు బుద్ధి లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు.

జగన్ మాట్లాడుతూ – “అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి, ఆయన మాట్లాడింది ఏంటి? అదంతా పనికిమాలిన సంభాషణ. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు. తాగి వచ్చిన వ్యక్తిని సభలోకి అనుమతిస్తారా? అలా మాట్లాడేందుకు అనుమతించిన స్పీకర్‌కే బుద్ధి లేదా?” అని అన్నారు. అంతటితో ఆగకుండా, “బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో ఆయన మాటలతోనే అర్థమవుతోంది. తన సైకలాజికల్ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలి” అని వ్యాఖ్యానించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ – “గత వైసీపీ ప్రభుత్వ కాలంలో సినీ ప్రముఖులను అవమానించారు” అని ప్రస్తావించగా, బాలకృష్ణ తన ప్రసంగంలో జగన్, చిరంజీవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద వివాదానికి దారితీస్తూ, వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి.

అయితే, బాలకృష్ణ ప్రస్తావన తీసుకురావడంపై చిరంజీవి స్పందిస్తూ, “గత ప్రభుత్వంలో ఎలాంటి అవమానం జరగలేదు, జగన్ గౌరవంగా ఆహ్వానించారు” అని స్పష్టం చేశారు. కానీ, జగన్ చేసిన తాజా ఆరోపణలు ఇప్పుడు రాజకీయ రంగంలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *