కర్ణాటక రాష్ట్రంలోని హల్లిఖేడ్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను, కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు అక్కడికక్కడే మృతి చెందగా, మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
మృతులను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), నాగరాజు (40)గా పోలీసులు గుర్తించారు.సమాచారం ప్రకారం, వీరంతా గణగాపూర్ దత్తాత్రేయ ఆలయ దర్శనం ముగించుకుని స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో ఉన్నారు.

ఈ క్రమంలో హల్లిఖేడ్ సమీపంలో ఎదురుగా వస్తున్న వ్యాను వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. ఢీకొన్న వేగం కారణంగా కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం తీవ్రతతో అక్కడి దారిలో వచ్చినవారు భయాందోళనకు గురయ్యారు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
