కరూర్ ఘటనపై విజయ్‌పై కేసు ఎందుకు లేదు?


41 మంది ప్రాణాల బలితో ముగిసిన కరూర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు తమిళనాడులో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. సెప్టెంబర్ 27న కరూర్ బస్టాండ్ మైదానంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్ నిర్వహించిన భారీ ర్యాలీలో అనూహ్యంగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు. అయితే, ఈ విషాదకర ఘటనపై టీవీకే నేతలు బుస్సీ ఆనంద్, ఆదావ్ అర్జున్‌లపై కేసులు నమోదు కాగా, విజయ్‌పై మాత్రం కేసు నమోదు చేయకపోవడాన్ని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

డీఎంకే ప్రభుత్వం ఈ అంశంపై స్పందిస్తూ, ఘటనపై పూర్తి విచారణ జరిగే వరకు ఎవరిపైనా తక్షణ చర్యలు తీసుకోలేమని పేర్కొంది. డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ మాట్లాడుతూ, జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిషన్ నివేదిక అనంతరమే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అయితే, వీసీకే అధినేత తిరుమావళవన్ డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎండగట్టారు. ఆయన పోలీసులపై ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారంటూ మండిపడ్డారు. “బుస్సీ ఆనంద్‌పై కేసు ఉంటే, ఆయన అధినేత విజయ్‌పై ఎందుకు లేదు?” అని ప్రశ్నించారు. ఇది పోలీసుల వేధింపులకు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

ఇక బీజేపీ తరఫున హేమ మాలిని నేతృత్వంలోని ఎన్డీఏ నిజనిర్ధారణ బృందం కరూర్‌లో బాధితులను పరామర్శించింది. ఈ బృందం డీఎంకే ప్రభుత్వ వైఫల్యాన్ని ఉదహరిస్తూ, కేంద్ర దర్యాప్తు కోరింది.

ఈ నేపథ్యంలో, విజయ్‌పై కేసు పెట్టకపోవడం వెనుక రాజకీయ ప్రేరణలేనా? లేకా న్యాయపరమైన కారణాలా? అన్న ప్రశ్నలు ఇప్పుడు వేడెక్కిస్తున్నాయి. కమిషన్ నివేదిక వెలువడే వరకు ఈ దుమారం మరింత రాజకీయ రూపు దాల్చే అవకాశాలు ఉన్నాయి.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *