పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎదురు చూస్తున్న ‘ఓజీ’ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా, విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్తో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఓవర్సీస్లో ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా మాత్రమే ‘ఓజీ’ 3 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 26 కోట్లు) మార్క్ను దాటింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ ఘనతను ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది మరియు ప్రత్యేక పోస్టర్ కూడా విడుదల చేసింది.
తెలుగు సినిమా చరిత్రలో ఇది మైలురాయిగా నిలుస్తోంది. పవన్ కల్యాణ్ మాస్ యాక్షన్ అవతార్, సుజీత్ దర్శకత్వం ప్రేక్షకులను ఆకట్టుకోవడం వలన వసూళ్ల వర్షం కురుస్తోంది. ట్రేడ్ నిపుణులు, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలవడం ఖాయం అని అంచనా వేస్తున్నారు.
సినిమా విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన పొందుతోంది. చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్ను పూర్తి మాస్ పాత్రలో చూడటం అభిమానులకు పండుగగా మారింది. సోషల్ మీడియా అంతా ‘ఓజీ’ వైబ్తో నిండిపోయింది.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హాష్మీ విలన్గా, ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరొక స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం ‘ఓజీ’ బాక్స్ఆఫీస్ వద్ద తన హవాను కొనసాగిస్తోంది.